వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్..
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:50 PM
వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది (Congress Vande Mataram).
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం సమావేశమై వందేమాతరం అంశంపై చర్చించింది. 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. అప్పట్లో జాతీయ, ప్రజా సమావేశాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తాజాగా గోవాలో జరిగిన ఓ కాంగ్రెస్ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించారు. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తూ ఆయన అసంపూర్ణ వందేమాతరం పాడారని ఆరోపించింది (1937 Congress Resolution).
బీజేపీ విమర్శలపై ఖర్గే ఘాటుగా స్పందించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ వంటి నాయకులు ఆలపించిన వందేమాతరాన్నే తాను పాడానని చెప్పారు. అదే తప్పయితే ఆ నాయకులపై కూడా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్నే తాను పాటించానని స్పష్టం చేశారు (Vande Mataram First Two Stanzas).
వందేమాతరం గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875లో రచించారు (National Song India). ఈ గీతంలోని తొలి రెండు చరణాలు మాతృభూమి ప్రకృతి సౌందర్యం, సస్యశ్యామలత్వాన్ని కీర్తిస్తాయి. ఆ తరువాతి చరణాల్లో హిందూ మతపరమైన, పౌరాణిక ప్రతీకలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే జాతీయ సమావేశాల్లో ఈ అంశాలు వివాదానికి దారితీయవచ్చన్న కారణంతో 1937లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే జాతీయ సమావేశాల్లో ఆలపించాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..