Share News

ఎమ్మెల్యేలపైనే ఓటర్ల ఆగ్రహం.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో సర్వే..

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:26 PM

2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఓటర్ల అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ ముఖ్యమంత్రుల కంటే ఎమ్మెల్యేల పనితీరుపైనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి.

ఎమ్మెల్యేలపైనే ఓటర్ల ఆగ్రహం.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో సర్వే..
2027 Assembly Elections Survey

ఇంటర్నెట్ డెస్క్: 2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఓటర్ల అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ ముఖ్యమంత్రుల కంటే ఎమ్మెల్యేల పనితీరుపైనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి (UP Punjab Uttarakhand Survey 202).


'వోట్ వైబ్' నిర్వహించిన సర్వేలో మూడు రాష్ట్రాల్లోని 6,000 మందికి పైగా ఓటర్లను ఆగస్టు 25 వరకు ప్రశ్నించారు. దీనితో పాటు ఇండియా-సీ ఓటర్ సర్వేలో జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య 25,184 మంది అభిప్రాయాలను సేకరించారు. పంజాబ్, ఉత్తరాఖండ్‌తో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్‌లోనే ఎమ్మెల్యేలపై అసంతృప్తి అత్యధికంగా కనిపించింది. 49 శాతం మంది తమ ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. కేవలం 27.9 శాతం మంది మాత్రమే ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు (2027 Assembly Elections Survey).


సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై అభిప్రాయం కొంత మెరుగ్గా ఉంది. 41.8 శాతం మంది ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా, 38.4 శాతం మంది అసంతృప్తి తెలిపారు. యూపీలో ప్రధాన ఎన్నికల సమస్యగా నిరుద్యోగం 23.1 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రైతుల సమస్యలు 14.1 శాతం, విద్య-వైద్యం 13.7 శాతం, ద్రవ్యోల్బణం 12.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని కూటమి 41.8 శాతంతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 38.7 శాతం మద్దతు ఉంది (Yogi Adityanath Survey).


ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై 39.1 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 38.1 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యేల విషయంలో పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉంది. 48 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, కేవలం 27.1 శాతం మంది సంతృప్తి తెలిపారు (MLA Voter Anger).


పంజాబ్‌లోనూ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎక్కువగానే ఉంది. 45.3 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 32.2 శాతం మంది మాత్రమే సంతృప్తి తెలిపారు. అయితే సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై 40 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 35.4 శాతం మంది అసంతృప్తి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 29 , 2026 | 02:17 PM