విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
ABN , Publish Date - Jun 09 , 2026 | 08:04 PM
మహిళల భద్రత కోసం 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ మంగళవారంనాడు ప్రారంభించారు.
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మంగళవారంనాడు ప్రారంభించారు. సింగప్పెన్ దళం చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ బృందాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గస్తీ వాహనాలను ప్రారంభించడంతో పాటు స్వయంగా ఒక వాహనాన్ని సీఎం నడిపారు. రాజరాతినం స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, మహిళలపై జరిగే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. నేరాలకు శిక్ష కూడా కఠినంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం సింగప్పెన్ బృందం రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లను మోహరిస్తుందని, ఈ తరహాలో ఏర్పాట్లు చేయడం దేశంలోనే తొలిసారని చెప్పారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడ ఎవరు మహిళలను వేధించినా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్కు అలవాటు పడిన వారే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని, మహిళలు, చిన్నారులపై నేరాలకూ మాదకద్రవ్యాల వ్యాప్తికీ సంబంధం ఉందన్నారు. మాదకద్రవ్యాల బెడదను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని చెప్పారు. సమస్యను చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నందున అది బలంగా వేళ్లూనుకుందని, ఈ నిర్లక్ష్యానికి కారకులెవరో తాను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని అన్నారు. సింగప్పెన్ కోసం తొలిదశలో రూ.354 కోట్లు కేటాయించనున్నామని, రెండో దశలో కొత్త యూనిట్ కోసం 2,500 కొత్త పోస్టులు కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన పోలీస్ పరేడ్లో విజయ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనియాగాంధీతో మమతా బెనర్జీ సమావేశం.. భవిష్యత్తు వ్యూహంపై చర్చ
కొత్త లుక్లో అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్