తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరిన విజయ్
ABN , Publish Date - May 05 , 2026 | 06:37 PM
టీవీకే పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని మోదీని కోరారు.
చెన్నై, మే 5: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభంజనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్న విజయ్, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమాల వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారు స్పందించిన తీరు పట్ల విజయ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది' అని ఆయన స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసం కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే TVK లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
తమిళనాడు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రధాని మోదీతో విజయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర పురోగతికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను కాదని, తమిళ ప్రజలు విజయ్కు పట్టం కట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు TVK వైపు మొగ్గు చూపడం ఈ భారీ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్
తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల