Share News

యోగి పాదాలకు మొక్కిన సువేందు అధికారి.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:58 AM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కాంతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పాదాభివందనం చేశారు.

యోగి పాదాలకు మొక్కిన సువేందు అధికారి.. వీడియో వైరల్
Yogi Adityanth and Suvendu Adhikari

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కాంతి (Kanthi) పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)కు బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) పాదాభివందనం చేశారు. వేదక వద్దకు యోగి ఆదిత్యనాథ్ చేరుకోగానే సువేందు అధికారి ఎదురువెళ్లి కాషాయ కండువా కప్పారు. ఆ వెంటనే పాదాభివందనం చేశారు. యోగి వెంటనే ఆయనను చేతిని ఆప్యాయంగా పట్టుకుని ఆడియెన్స్‌ వైపు తిరిగి అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


టీఎంసీ పాలనలో బెంగాల్ సంస్కృతి ధ్వంసం

అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్ సంస్కృతి, శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. చొరబాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సారథ్యంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సుస్థిరత సాధ్యమవుతుందని అన్నారు. బెంగాల్‌లో మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, దీంతో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.


మాల్దా, ముర్షీదాబాద్, బీర్భూమ్ వంటి ప్రాంతాల్లో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని యోగి ఆరోపించారు. రామనవమి ఊరేగింపులపై ఆంక్షలు విధిస్తూ, దుర్గాపూజోత్సవాలను అడ్డుకుంటూ హిందూ పండుగలను పరిరక్షించడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చొరబాట్లను అనుమతిస్తూ భౌగోళిక సమతుల్యతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలు, మాఫియా పాలనకు టీఎంసీ వత్తాసు పలుకుతోందన్నారు. కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఈనెల 23, 29 తేదీల్లో జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

టీఎంసీలో చేరిన నేతాజీ మునిమనుమడు

మోదీ యూటర్న్‌కు 30 నెలలు పట్టింది.. పార్లమెంటు ప్రత్యేక సమావేశంపై సోనియాగాంధీ ఫైర్

Updated Date - Apr 13 , 2026 | 12:11 PM