సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
ABN , Publish Date - May 11 , 2026 | 11:05 AM
సువేందు అధికారి పీఏ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బిహార్, ఉత్తర్ ప్రదేశ్లకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం అర్ధరాత్రి వేళ బెంగాల్కు తరలించినట్టు సమాచారం. నిందితులలో ఒకరు టోల్ ప్లాజా వద్ద యూపీఐ ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేయడంతో దర్యాప్తు అధికారులు వారి కదలికలను గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు బిహార్లోని బక్సర్కు చెందినవారు కాగా, మరొకరు యూపీలోని బల్లియా వాసి. అయితే.. అతను కూడా బక్సర్లోనే నివసిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కాగా.. బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 6న రాత్రి.. సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోల్కతా నుంచి తన స్కార్పియో వాహనంలో వెళుతున్న చంద్రనాథ్ను డోరియా రహదారిపై హత్య చేశారు. ఆయన వాహనాన్ని ఓ కారు అకస్మాత్తుగా ఓవర్ టేక్ చేయగా బైక్పై ఉన్న నిందితులు కారు ఎడమవైపు నుంచి వచ్చి నేరుగా చంద్రనాథ్పై కాల్పులు జరిపడంతో ఆయన మృతిచెందారు. ఈ ఘటనలో రథ్ డ్రైవర్కు కూడా బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయి. ఆయన్ను కోల్కతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్
శ్మశాన వాటిక అడ్డాగా అక్రమ దందా.. శవాల మీది దుస్తులను..