జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - Feb 25 , 2026 | 06:22 PM
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. సోరెన్పై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన క్రిమినల్ ప్రొసీడింగ్స్పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఉపశమనం లభించింది. సోరెన్పై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన క్రిమినల్ ప్రొసీడింగ్స్పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. కేసు కొట్టేయాల్సిందిగా కోరుతూ సోరెన్ వేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈడీని అదేశించింది. పదేపదే తనకు ఈడీ సమన్లు జారీ చేస్తుండటాన్ని కూడా సోరెన్ తన పిటిషన్లో సవాలు చేశారు.
ఈకేసులో విచారణ దాదాపు పూర్తి కావచ్చిందని, ఏడుసార్లు సమన్లు జారీ చేస్తే ఒక్కసారి కూడా సోరెన్ హాజరుకాలేదని విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే సోరెన్ తరఫు హాజరైన సీనియర్ న్యాయవాది ఆ వాదనను తోసిపుచ్చారు. సోరెన్ మూడుసార్లు హాజరయ్యారని, ఈడీ ఆయనను అరెస్టు కూడా చేసిందని చెప్పారు. తమ పిటిషన్ను మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకున్న ఏడాది తర్వాత ఆలస్యంగా సోరెన్ క్వాషింగ్ పిటిషన్ వేసినట్టు ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఈడీ బల్క్ కంప్లయింట్లు చేసినట్టు వార్తాపత్రికలో చదివామని, ఫిర్యాదులపై దృష్టిసారించడం కంటే నిర్మాణాత్మక ఫలితాలతో ముందుకు రావాలని ఈడీకి సూచించింది.
సోరెన్కు భూముల కుంభకోణంలో ప్రమేయం ఉందని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కేసును కొట్టివేయాలని సోరెన్ వేసిన పిటిషన్ను జనవరి 15న హైకోర్టు కొట్టివేసింది. దీంతో తమ సమన్లకు స్పందించడం లేదంటూ ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈడీ క్రిమినల్ ప్రొసీడింగ్స్పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్సీఈఆర్టీపై సుప్రీం సీరియస్
పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్పై కేంద్రం