భోజ్శాల వివాదంపై రోజువారీ విచారణకు సిద్ధం: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:24 PM
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్శాల-కమాల్ మౌలా మసీదు సముదాయం వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం అత్యంత సున్నితమైనదని పేర్కొంది.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్శాల-కమాల్ మౌలా మసీదు సముదాయం వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం అత్యంత సున్నితమైనదని పేర్కొంది. సమస్యకు వేగవంతమైన పరిష్కారం కోసం అవసరమైతే రోజువారీ విచారణ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అలాగే హిందూ, ముస్లిం వర్గాలు సంయమనం పాటించాలని, ఈ అంశంపై ఎలాంటి ఉద్రిక్తతలకూ తావివ్వొద్దని సూచించింది (Bhojshala dispute).
భోజ్శాల సముదాయాన్ని సరస్వతి దేవి ఆలయంగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం పక్షం దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఈ కేసు అత్యంత సున్నితమైనదని, కోర్టు చేసే ప్రతి వ్యాఖ్యను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రార్థనల వ్యవస్థను కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది (Saraswati Temple).
ఈ కేసును 10 నుంచి 15 రోజుల్లో తగిన ధర్మాసనం ముందు ఉంచుతామని, తుది విచారణ ప్రారంభమైన తర్వాత అవసరమైతే ప్రతిరోజూ విచారణ నిర్వహించి వీలైనంత త్వరగా వివాదానికి పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. (Bhojshala Kamal Maula Mosque).
ధార్లోని భోజ్శాల సముదాయం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. హిందూ వర్గాలు దీనిని వాగ్దేవి సరస్వతి ఆలయంగా పేర్కొంటుండగా, ముస్లిం వర్గాలు దీనిని కమాల్ మౌలా మసీదుగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సముదాయం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. ఈ ప్రాంగణంలో నిర్దిష్ట రోజుల్లో హిందువులు పూజలు చేస్తుండగా, శుక్రవారం నాడు ముస్లింలు నమాజ్ నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..