Share News

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ‌ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం

ABN , Publish Date - Jun 15 , 2026 | 09:32 PM

అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారంనాడు లాంఛనంగా విచారణ ప్రారంభించింది.

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ‌ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం
Ayodhya Ram Temple

అయోధ్య: అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సోమవారంనాడు లాంఛనంగా విచారణ ప్రారంభించింది. ఆలయానికి వచ్చిన రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకూ విరాళాలు చోరీకి గురయ్యాయని, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఇటీవల వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. దీనిపై విపక్ష సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమ్ సోమవారంనాడు అయోధ్యకు చేరుకుంది.


సిట్ అధికారులు విచారణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2.58 గంటల నుంచి ఆలయంలోనే ఉన్నారని, ఆలయ ప్రాంగణ అడ్మినిస్ట్రేటర్ గోపాల్ రాయ్‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. ఈ కేసులో గోపాల్ రాయ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 5.46 గంటలకు ఆలయం వెలుపలకు వచ్చిన గోపాల్ రాయ్ తిరిగి 6.50 గంటలకు ఆలయంలోకి వచ్చారని, విచారణ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. విరాళాల లెక్కింపుతో ప్రమేయం ఉన్న సుమారు 50 మందిని సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది ఇంతవరకూ ఈ కేసుకు సంబంధించి ఐదుగురు ఉద్యోగుల నుంచి పోలీసులు సుమారు రూ.2 కోట్లు రికవరీ చేసినట్టు తెలుస్తోంది.


విరాళాలకు సంబంధించిన అవకతవకలపై శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు చేసిన విజ్ఞప్తితో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. ఈ టీమ్‌లో ఐఏఎస్ అధికారి విజయ్ విశ్వాస్ పంత్, ఐపీఎస్ అధికారి ఎస్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఉన్నారు. కేసు ప్రాథమిక విచారణ, తుది నిర్ధారణతో కూడిని నివేదికను సాధ్యమైనంత తర్వగా సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో కమిటీ నివేదిక అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

బద్రీనాథ్ ఆలయానికి ముకేశ్ అంబానీ.. రూ.10 కోట్ల విరాళం..

మమతా బెనర్జీ ఇంటి బయట టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై గుడ్లతో దాడి

Updated Date - Jun 15 , 2026 | 09:40 PM