Share News

ఆర్ఎస్ఎస్‌‌ను రిజిస్టర్ చేయించుకుని పన్ను కట్టండి.. మోహన్ భాగవత్‌కు ప్రియాంక్ ఖర్గే లేఖ

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:51 PM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చట్టబద్ధ హోదా, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్మాణం, పన్ను వర్తింపు వివరాలను బహిర్గతం చేయాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే కోరారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు సోమవారంనాడు లేఖ రాశారు.

ఆర్ఎస్ఎస్‌‌ను రిజిస్టర్ చేయించుకుని పన్ను కట్టండి.. మోహన్ భాగవత్‌కు ప్రియాంక్ ఖర్గే లేఖ
Priyank Kharge and Mohan Bhagwat

బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చట్టబద్ధ హోదా, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్మాణం, పన్ను వర్తింపు వివరాలను బహిర్గతం చేయాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) కోరారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ (Mohan Bhagwat)కు సోమవారంనాడు లేఖ రాశారు. ఆ లేఖను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.


శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్న ఆర్ఎస్ఎస్‌కు ప్రియాంక్ ఖర్గే తొలుత అభినందలు తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రకటించిన వార్షిక నివేదికను ప్రస్తావిస్తూ, కర్ణాటకలో 4,127 రోజువారీ శాఖలు, 1,389 వీక్లీ మిలన్స్, 60 నెలవారీ సమావేశాలు జరిగాయని, 2,194 సమాజసేవా కార్యాక్రమాల్లో 19.6 లక్ష మంది ప్రజలు పాల్గొన్నారని, 562 రూట్‌మార్చ్‌లలో 2.2 లక్షల మంది యూనిఫాంలో పాల్గొన్నారని వివరించారు. ఇంత పెద్ద సంస్థాగతమైన ఉనికి ఉన్న ఒక సంస్థను ప్రైవేటు సంస్థగానో, అనధికార ఏర్పాటుగానో భావించలేమని ఆ లేఖలో ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు.


సంస్థ స్థాయిని చూసినప్పుడు చట్టబద్ధ హోదా, జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత, అనుమతులు, విరాళాల మూలం వంటివి భారతచట్టాలకు అనుగుణంగా ఉన్నాయా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయని ప్రియాంక్ ఖర్గే అన్నారు. లాంఛనపరమైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యక్రమాల నిర్వహణపైనా ఆయన ప్రశ్నించారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని కోరారు.


'రాజ్యంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద సంస్థ అయినా, పలుకుబడి ఉన్న సంస్థ అయినా, ఎంత పాత సంస్థ అయినా స్క్రూటినీకి అతీతం కాదు. ఎన్జీఓలు, సొసైటీలు, మతపరమైన సంస్థలు, కంపెనీలు రొటీన్‌గా తమ కార్యకలాపాలు, ఆర్థిక వివరాలు వెల్లడిస్తుంటాయి. జాతీయతావాదం, క్రమశిక్షణ, విద్యుక్తధర్మం గురించి చెప్పే సంస్థ జవాబుదారీతనం, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. తాము ప్రమాణాలను పాటించకుండా సాధారణ పౌరులను ఆ ప్రమాణాలను పాటించమని ఆర్ఎస్ఎస్ అడగలేదు' అని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆత్మావలోకం చేసుకుని లాంఛనంగా సంస్థను రిజిస్టర్ చేయించుకోవాలని, ఆర్థిక వనరులు, కార్యకలాపాలను వెల్లడించాలని, అర్హమైన పన్నులన్నీ చెల్లించాలని, భారత చట్టాల ప్రకారం పారదర్శకత, జవాబుదారీ కలిగిన సంస్థగా కార్యకలాపాలను నిర్వహించాలని కోరారు.


ఇవి కూడా చదవండి...

ఉచిత బస్సు పథకం వేళ కేరళ మంత్రి తలపై పడిన పాయసం

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

Updated Date - Jun 15 , 2026 | 08:10 PM