విద్యార్థులకు నాణ్యమైన హాస్టళ్ల కొరతపై రాహుల్ గాంధీ ఆందోళన
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:01 PM
ఢిల్లీలోని సత్యనికేతన్ 4 అంతస్తుల పీజీ భవనం కూలిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కళాశాలల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని మండిపడ్డారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 6: ఢిల్లీలోని 4 అంతస్తుల సత్యనికేతన్ పీజీ (PG) భవనం కూలిపోయిన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం, ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు ఇరుకు భవనాలు, నాసిరకం పీజీల్లో ప్రమాదకర పరిస్థితుల మధ్య నివసించాల్సి వస్తోందని ఆయన మండిపడ్డారు.
'ఈ ఘటన ఎంతో బాధాకరం, ఆందోళనకరం. విద్యార్థుల జీవితాలు ఇప్పటికే ఎన్నో పోరాటాలతో నిండి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వసతి గృహాలు లేక ఒకే చోట 30-40 మంది విద్యార్థులు అమానవీయ, ప్రమాదకర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది. ప్రతి విద్యార్థి ప్రాణం అత్యంత విలువైనది, వారి భద్రతను అన్ని వేళలా పరిరక్షించాలి' అని X (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
కాగా, ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో సత్యనికేతన్లోని ఒక పీజీ భవనం (హోస్టల్ డేజ్) ఒక్కసారిగా కూలిపోయింది. బేస్మెంట్లో రిపేర్ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సహాయక చర్యలు: ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి పలువురిని రక్షించి ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్కు తరలించారు.
ప్రభుత్వ యంత్రాంగ స్పందన:
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. పక్కనే ఉన్న భవనాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించామని, చిక్కుకున్న వారిని రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి సమీక్ష: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ ఢిల్లీ సీఎం, పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డిజిలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!