2029 ప్రధాని అభ్యర్థిగా విజయ్! తమిళనాట ముదురుతున్న రచ్చ
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:59 PM
2029 లోక్సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై తమిళనాట మళ్లీ రచ్చ మొదలైంది. ఈ అంశం మీద కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 17: లోక్సభ 2029 ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై తమిళనాట మళ్లీ రచ్చ మొదలైంది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ల వరకూ విషయం చేరడంతో మరో సారి ఈ అంశం కలకలం రేపింది. తాజాగా తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కే సెల్వపెరుంథగై ప్రధాని అభ్యర్థిత్వం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ రాహుల్ గాంధీని 2029 ప్రధాని అభ్యర్థిగా స్పష్టంగా ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించని పార్టీలతో పొత్తు కొనసాగించడంలో అర్థం లేదన్నారు.
సెల్వపెరుంథగై వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. సెల్వపెరుంథగైకు కూటమి గురించి మాట్లాడే అధికారిక హోదా లేదని ఎద్దేవా చేశారు. టీవీకేతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని, ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు.
మొదట ఈ వివాదానికి'ఇండియా టుడే - సీఓటర్' నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' జాతీయ సర్వే ప్రధాన కారణమైంది. ఈ సర్వేలో 2029 ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలవగా, రాహుల్ గాంధీ 27శాతం మద్దతుతో రెండో స్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరంగా తమిళనాడు సీఎం విజయ్కు జాతీయ స్థాయిలో 9.2శాతం మద్దతు లభించి ఆయన మూడో స్థానంలో నిలిచారు.
సర్వేలో విజయ్కి లభించిన పాపులారిటీని చూసి టీవీకే పార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియాలో 'Vijay for PM' క్యాంపెయిన్ను విపరీతంగా ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ అంశం మీద స్పందిస్తూ తమ అభిప్రాయాల్ని బయటపెడుతుండటం తమిళనాడులో అధికార కూటమి మధ్య రాజకీయ రచ్చకు కారణమౌతోంది.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News