ఆప్ బలంగా ఉంది.. విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన పంజాబ్ సీఎం
ABN , Publish Date - May 01 , 2026 | 06:26 PM
పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రవేశపెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' నుంచి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించడంతో ఆప్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని (Cofidence Motion) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రవేశపెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' నుంచి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించడంతో ఆప్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సభలో ప్రవేశపెట్టారు. ఆప్ బలంగా ఉందని, పార్టీ మరింత విస్తరించనుందని తెలిపారు.
'జమ్మూకశ్మీర్ నుంచి గోవా వరకూ ఆప్ బలంగా ఉంది. జమ్మూకశ్మీర్లోని దోడాలో కూడా మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. పంజాబ్లో మా ప్రభుత్వ విజయవంతంగా నడుస్తోంది. ఢిల్లీలో మేము విపక్షంలో ఉన్నాం. గుజరాత్లో ఐదుగురు, గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు. వీటితో పాటు అనేక ప్రాంతాల్లో మేయర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నారు. మా పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు కలిగి ఉంది' అని భగవంత్ మాన్ ఈ సందర్భంలో సభకు వివరించారు. ఒకరోజు ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని ఇంతకుముందు ఒక విప్ను కూడా ఆప్ జారీ చేసింది.
పూర్తి మెజారిటీ
పంజాబ్ అసెంబ్లీలో 117 మంది సభ్యులుండగా, 94 మంది సభ్యులతో ఆప్ సంపూర్ణ మెజారిటీ కలిగి ఉంది. కాంగ్రెస్కు 16 మంది, బీఎస్పీకి ఒకరు, సాద్కు ముగ్గురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఇండిపెంటెంట్ ఎమ్మెల్యే కూడా సభలో ఉన్నారు. కాగా, ఏప్రిల్ 24న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ సభ్యులలో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్బజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్జిత్ సాహ్ని, స్వాతి మలివాల్ పార్టీని వీడి బీజేపీలో విలీనం అయ్యారు. ఈ ఏడుగురు ఎంపీల్లో ఆరుగురు పంజాబ్కు చెందిన వారే కావడం విశేషం. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
ఇవి కూాడా చదవండి..
మద్యం మత్తులో అసెంబ్లీకి సీఎం? పరీక్ష చేయాలంటూ విపక్షాల డిమాండ్
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు