లైంగిక వేధింపుల కేసు.. కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు..
ABN , Publish Date - Aug 03 , 2026 | 02:45 PM
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్లను లైంగిక వేధింపుల కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ, ఆగస్టు 3: మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్లను లైంగిక వేధింపుల కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై ఇవాళ (సోమవారం) మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. మహిళల భద్రత, సాధికారత గురించి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్పుకొంటుంటే, మరోవైపు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
'ఒకవైపు యువతకు అండగా ఉన్నామని, మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారు. మరోవైపు ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి' అని ప్రియాంక గాంధీ అన్నారు.
అటు, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ప్రత్యేకంగా.. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్కు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన ఆయన, గత పార్లమెంట్ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్న హోంమంత్రి ఈసారి ఎందుకు సభకు రావడం లేదని నిలదీశారు.
అలాగే అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం అంశంపై కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదని ఆరోపించారు. విరాళాల దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేస్తున్నారని, అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
ఈ కేసు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రారంభమైంది. 2023లో ఢిల్లీ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపులు, మహిళలపై దాడి, బెదిరింపులు తదితర అభియోగాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వినోద్ తోమర్ కూడా సహ నిందితుడిగా ఉన్నారు.
వార్తలు కూడా చదవండి...