ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం..
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:41 AM
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఢిల్లీ, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఇదే సమయంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
దేశ చరిత్రలో ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని (Vande Mataram) పూర్తిగా ఆలపించడం ఇదే ప్రథమం. అనంతరం జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించారు. ఆ సమయంలో భారత వాయుసేన చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను.. మరొకటి ‘వందేమాతరం’ అని రాసి ఉన్న పతకాన్ని తీసుకెళ్లి.. ఆకాశంలో కనువిందు చేశాయి.
‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే జాతీయ గీతం ‘జన గణ మన’తో పాటు వందేమాతరానికి కేంద్ర ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. ‘వందేమాతరం’ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. 'వందేమాతరం' గేయాన్ని మొదటిసారిగా 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ
ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం