మీరు కొంచెం మారారు.. మోదీ-ఖర్గే సరదా సంభాషణ..
ABN , Publish Date - Aug 12 , 2026 | 04:59 PM
తరచుగా రాజకీయ విమర్శలు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకులు సరదాగా మాట్లాడుకున్న అరుదైన దృశ్యం కనిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: తరచుగా రాజకీయ విమర్శలు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకులు సరదాగా మాట్లాడుకున్న అరుదైన దృశ్యం తాజాగా కనిపించింది. ఢిల్లీలో ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహ రిసెప్షన్లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది (PM Modi Mallikarjun Kharge).
సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహ రిసెప్షన్కు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అక్కడే ఉన్నారు. ముందుగా రాహుల్ గాంధీతో మోదీ కరచాలనం చేశారు. అనంతరం ప్రియాంక గాంధీని పలకరించారు. 'ప్రియాంకాజీ.. ఎలా ఉన్నారు?' అని మోదీ అడిగారు. తాను బాగున్నానని, మీరు ఎలా ఉన్నారని ప్రియాంక ప్రశ్నించారు. అందుకు మోదీ 'నేను అలాగే ఉన్నాను' అని సమాధానం ఇచ్చారు (PM Modi Kharge Banter).
ప్రధాని మోదీ సమాధానానికి అక్కడే ఉన్న మల్లికార్జున్ ఖర్గే వెంటనే సరదాగా స్పందించారు (Delhi Wedding Reception). 'అలా కాదు.. మీరు కొంచెం మారిపోయారు' అంటూ చమత్కరించారు. దీంతో మోదీ నవ్వుతూ ఖర్గే చేతిపై తట్టారు. సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం నాగ్పూర్కు చెందిన పారిశ్రామికవేత్త సరంగ్ లఖానీతో జూన్లో ముంబైలో జరిగింది. ఢిల్లీలోని 6, జనపథ్లో సోమవారం రాత్రి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..
భారత్పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి