Share News

'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ విమర్శలు

ABN , Publish Date - Jul 23 , 2026 | 10:38 AM

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ విమర్శలు
PM Modi Promises Fast-Track Courts.. Rahul Gandhi Hits Back

ఢిల్లీ, జులై 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనను ఖండిస్తూ, దేశంలోని యువత భవిష్యత్తుకు అత్యధికంగా నష్టం కలిగించింది మీరేనంటూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


రాహుల్ గాంధీ కౌంటర్.. 'యువత భవిష్యత్తుకు అతిపెద్ద ముప్పు మీరే'

ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే రాహుల్ గాంధీ 'X' వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతోందన్న ప్రధాని మాటలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. 'మన దేశ యువత భవిష్యత్తుకు అతిపెద్ద ద్రోహం చేసి, దానిని నాశనం చేసింది మీరే' అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ విద్యావ్యవస్థను పూర్తిగా దిగజారిపోయేలా, కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించిందని, బాధ్యులందరినీ ఈ ప్రభుత్వమే వెనకేసుకొచ్చిందని ఆయన విమర్శించారు.


ఈ సందర్భంగా ప్రధాని ప్రకటనతో సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ, విద్యార్థులు, విపక్షాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లను మరోసారి గుర్తుచేశారు.

1. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్: పేపర్ లీక్ అంశానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి లేదా ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలి.

2. విద్యార్థులకు బహిరంగ క్షమాపణ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులకు, వారిని ఇబ్బంది పెట్టిన తీరుకు ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.

3. బాధ్యులపై చర్యలు, కేసుల ఉపసంహరణ: విద్యార్థులపై అక్రమంగా ప్రయోగించిన బలప్రయోగాన్ని, వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ కూడా ప్రధాని ప్రకటనపై స్పందిస్తూ... పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చించే ధైర్యం లేకనే ప్రధాని సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని, దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనల వత్తిడి కారణంగానే ఆయనలో వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ట్రేడింగ్‌ పేరుతో రూ.15 కోట్లకు టోకరా

రాష్ట్రంలో మరో 4 కొవిడ్‌ కేసులు

Updated Date - Jul 23 , 2026 | 11:00 AM