ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్లకు టోకరా
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:36 AM
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం వరకు భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి పలువురిని రూ. 15 కోట్ల మేర మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని..
నెలకు 10-20 శాతం లాభాలు వస్తాయని రూ.లక్షల్లో సేకరణ
తెలంగాణకు చెందిన మోసగాడు కడపలో అరెస్టు
కడప క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం వరకు భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి పలువురిని రూ. 15 కోట్ల మేర మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని కడప రిమ్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ సంస్థలు నడుపుతూ వివిధ రాష్ట్రాల్లో కూడా రూ.కోట్లు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రిమ్స్ సీఐ రాజగోపాల్ కథనం మేరకు.. భద్రాచలంలోని ఆధార్నగర్ కాలనీకి చెందిన కిచ్చా వీరభద్రరావు అలియాస్ కేవీ రావు ప్రస్తుతం హైదరాబాద్ నాగోల్లో నివాసం ఉంటూ వీఆర్ ట్రేడింగ్ సర్వీసెస్, రావు ట్రేడింగ్ గ్రూప్ పేర్లతో కార్యాలయాలు నిర్వహిస్తున్నాడు. కడప నగరానికి చెందిన కమతం సుజాత, మరో బాధితురాలు సునీతలను వంచించి సుమారు రూ. 55 లక్షల మేర మోసం చేశాడు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు రిమ్స్ పోలీసు స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడు తన సహచరులతో కలిసి ఏపీ, తెలంగాణ, హరియాణ తదితర రాష్ట్రాల్లో మోసాలు చేయడంతో నాలుగు రాష్ట్రాల్లో ఇతనిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.