Share News

మళ్లీ అదే సీను.. దీదీ సమావేశానికి హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 09:07 PM

మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు.

మళ్లీ అదే సీను.. దీదీ సమావేశానికి హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు
Mamata Banerjee

కోల్‌కతా: మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు. మమతా బెనర్జీ నివాసంలో కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరు కాగా.. శుక్రవారంనాడు కూడా ఇదే తరహా సన్నివేశం చోటుచేసుకుంది. పార్టీ అధినేత్రి కాళీఘాట్ హౌస్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేయగా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.


ఆరుగురు ఎంపీలు హాజరు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఉభయ సభల్లో 41 మంది ఎంపీలు ఉన్నారు. అయితే మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి 28 మంది లోక్‌సభ ఎంపీల్లో నలుగురు, రాజ్యసభలోని 13 మంది ఎంపీల్లో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. హాజరైన ఎంపీల్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నారు. రాజ్యసభ ఎంపీల్లో డెరిక్ ఒబ్రెయిన్, డోలా సేన్ మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలలో మదన్ మిత్రా, బీనా మోందల్, ఆషిమా పాత్ర, ఫిర్హాద్ హకీం, కునాల్ ఘోష్, సోవన్‌బెద్ ఛటోపాధ్యాయ్, బిమన్ బెనర్జీ, అశోక్ దేబ్ ఉన్నారు.


వివరణ ఇచ్చిన టీఎంసీ

కాగా, పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజర్ కావడంపై టీఎంసీ వివరణ ఇచ్చింది. ఇదేమీ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశం కాదని, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించ లేదని తెలిపింది. నేషనల్ వర్కింగ్ కమిటీలోని మహువా మొయిత్ర, సుష్మిత దేవ్, ముకుల్ సంగ్లా, రాజేష్ త్రిపాఠీ వంటి పలువురు ఎంపీలు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారని వివరించింది.


పెరగనున్న రెబల్స్ సంఖ్య

కాగా, ఎమ్మెల్యేల రెబల్ గ్రూప్‌లో త్వరలోనే మరికొంత మంది వచ్చి చేరనున్నట్టు పార్టీ నుంచి ఇటీవల బహిష్కరణ గురై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులైన రితబ్రత బెనర్జీ చెప్పారు. సంఖ్యాబలంపై అడిగినప్పుడు, సంఖ్య పెరుగుతూనే ఉంటుందన్నారు. తమకు అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని, అసెంబ్లీ సమావేశాల నాటికి ఆ సంఖ్య పెరుగుతుందని చెప్పారు. పార్టీ ఎంపీలు రెబల్ గ్రూప్‌గా ఏర్పడే అవకాశాలపై ప్రశ్నించగా, గత వారం రోజులుగా తాను ఏ ఒక్క ఎంపీతోనూ మాట్లాడలేదని, ఇప్పటికైతే ఎంపీల గురించి తాను ఏమీ చెప్పలేనని అన్నారు. కాగా, టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల తదుపరి చర్యగా బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, ఆ పార్టీతో సంప్రదింపులు సైతం జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

Updated Date - Jun 05 , 2026 | 09:27 PM