చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం
ABN , Publish Date - Jun 01 , 2026 | 08:32 PM
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జూన్ 3న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ చర్చ మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, అంతర్గత కలహాలను పార్టీ ఎదుర్కొంటోందని, ఆ కారణంతోనే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జూన్ 3న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ చర్చ మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, అంతర్గత కలహాలను పార్టీ ఎదుర్కొంటోందని, ఆ కారణంతోనే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ప్రభుత్వం సమీప భవిష్యత్తుల్లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోబోతోందని తాజా పరిణామాలపై బీజేపీ స్పందించగా, ఆ విమర్శలను ఎన్సీ తిప్పికొట్టింది.
మునుగుతున్న ఓడ
నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం 'మునుగుతున్న ఓడ' అని, చిట్టచివరి ప్రయత్నంగా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తోందని విపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందని, త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని చెప్పారు. ఒమర్ నాయకత్వంపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారిని బుజ్జగించేందుకు ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జూన్ 3న అత్యవసర సమావేశాన్ని ఒమర్ ఏర్పాటు చేశారని చెప్పారు. 'అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇదే చివరి ప్రయత్నం. అయితే ఒమర్ ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. సమావేశం తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు జూన్ 3 వరకూ వేచిచూడాల్సిందే' అని అన్నారు.
మండిపడిన ఒమర్
బీజేపీ నేత సునీల్ శర్మ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తిప్పికొట్టారు. ఎమ్మెల్యేలతో సమావేశం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తులు ఎంతో తెలిసినట్టు మాట్లాడటం వింతగా ఉందన్నారు. 'అన్నీ తెలిసిన వాళ్లు మాట్లాడరు. మాట్లాడే వ్యక్తులే విపక్షంలో ఉంటారు' అని చురకలు వేశారు. రాజకీయ ఊహాగానాల్లో విహరించడం మాత్రమే బీజేపీకి తెలుసునని నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ రంజాన్ చౌదరి పేర్కొన్నారు. ఎన్సీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు గతంలో కూడా విఫలమయ్యాయని గుర్తు చేశారు. ఎన్సీ ముక్కలయ్యే పార్టీ కాదని, చాలా బలంగా, పూర్తి సురక్షితంగా ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ అసలు సమస్యలను పక్కదారి పట్టించాలనుకుంటోందని విమర్శించారు. ఎన్సీ ఎమ్మెల్యే సల్మాన్ సాగర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయడం రొటీన్ ప్రక్రియేనని చెప్పారు. విపక్ష నేతలు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, అయితే ఎన్సీ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి. 90 మంది సభ్యుల అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 29 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 6, పీడీపీ 3, సీపీఎం 1, జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ పార్టీ (జేపీసీ)-1, ఆప్-1, స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాల్లో గెలిచారు.
ఇవి కూడా చదవండి..
కొత్త పార్టీ యోచనలో అన్నామలై..!
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్