టెకీ మృతి ఘటన.. నొయిడా సొసైటీ బిల్డర్ అరెస్టు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:47 PM
ఉత్తరప్రదేశ్లోని నొయిడా సెక్టార్ 150లో నీటిగుంటలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి యువరాజ్ మెహతా మృతి చెందిన ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంజీ విష్ టౌన్ సొసైటీ బిల్డర్ అభయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని నొయిడా సెక్టార్ 150లో నీటిగుంటలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి యువరాజ్ మెహతా మృతి చెందిన ఘటనకు సంబంధించి ఎంజీ విష్ టౌన్ సొసైటీ బిల్డర్ అభయ్ కుమార్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే 'సిట్'ను ఏర్పాటు చేశారు. నొయిడా అథారిటీ సీఈవోను ఆ పదవి నుంచి తప్పించి వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు.
మరోవైపు.. నొయిడా సెక్టార్ 150 పరిసరాల్లో రోడ్ల భద్రతను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్టు గ్రేటర్ నొయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. రోడ్లు, సమీప ప్రాంతాల్లో భద్రతపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని జీఎన్ఐడీఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్జీ.రవికుమార్ అధికారులను ఆదేశించారు. గుంతలను వెంటనే పూడ్చాలని ఆదేశాలిచ్చారు. ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాలను(బ్లాక్ స్పాట్స్)ను గుర్తించి ప్రమాదాల నివారణకు మార్కింగ్ చేయాలని కూడా సీఈఓ అదేశించారు.
సెక్టార్ 150లో నివాసముంటున్న 27ఏళ్ల యువరాజ్ మెహతా.. జనవరి 16న తన ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయన కారు ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద అదుపుతప్పి మురుగు కాలువ గోడను ఢీకొట్టి పక్కనే ఉన్న నీటిగుంటలో పడింది. కాపాడమంటూ దాదాపు రెండు గంటలు ఆయన ఆర్తనాదాలు చేసినట్టు స్థానికులు తెలిపారు. అయితే.. నీటిలో ఊపిరాడక ఆయన ప్రాణాలు కోల్పోయారు. మున్సిపల్ యంత్రాంగం, రియల్ ఎస్టేట్ డెవలపర్ల నిర్లక్ష్యం వల్ల ఈ మరణం సంభవించినట్టు యువరాజ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో మీరట్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సారథ్యంలో 'సిట్' టీమ్ను ఏర్పాటు చేశారు సీఎం యోగి. మీరట్ డివిజనల్ కమిషనర్, పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ కూడా ఈ ప్యానెల్లో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నితిన్ నబీన్కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు
Read Latest National News