Share News

పోర్చుగల్‌లో ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి అమ్మేశారు..

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:30 PM

విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్‌కు పంపిన ఓ సంస్థ దారుణంగా మోసం చేసింది. చివరకు ఆమెను అక్కడ ఓ బీర్‌ దుకాణ యజమానికి విక్రయించింది.

పోర్చుగల్‌లో ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి అమ్మేశారు..
Nagpur woman Portugal job scam

విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్‌కు పంపిన ఓ సంస్థ దారుణంగా మోసం చేసింది. చివరకు ఆమెను అక్కడ ఓ బీర్‌ దుకాణ యజమానికి విక్రయించింది. ఉద్యోగం పేరుతో ఆమె నుంచి సుమారు రూ.11 లక్షలు కూడా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పుణె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు (Nagpur woman Portugal job scam).


బాధితురాలు సామాజిక మాధ్యమం ద్వారా పుణెలోని 'వుయ్ మైగ్రేట్‌' అనే ఉద్యోగ కన్సల్టెన్సీని సంప్రదించింది. పోర్చుగల్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని, నెలకు రూ.1.5 లక్షల వరకు జీతం వస్తుందని, రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని నిర్వాహకులు ఆమెకు హామీ ఇచ్చారు. వీసా, ఇతర పత్రాల ప్రక్రియ పేరుతో ఆమె నుంచి విడతల వారీగా సుమారు రూ.11 లక్షలు వసూలు చేశారు. పోర్చుగల్‌ చేరుకున్న వెంటనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బాధితురాలు ఆరోపించింది (Portugal human trafficking).


పోర్చుగల్‌లోని ఏజెంట్లు ఆమె నుంచి పాస్‌పోర్టును తీసుకుని, రెండు రోజుల పాటు ఒక గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత ఆమెను ఓ బీర్‌ దుకాణ యజమానికి విక్రయించారు. అక్కడ తనతో బలవంతంగా పని చేయించారని, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించింది. తన పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు పేర్కొంది (overseas job fraud).


దాదాపు నెల రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత తప్పించుకునే అవకాశం లభించిందని బాధితురాలు తెలిపింది (Pune job consultancy scam). మొదట బస్సులో లిస్బన్‌కు వెళ్లి, అక్కడి నుంచి మాడ్రిడ్‌కు చేరుకుంది. అనంతరం దోహా మీదుగా భారత్‌కు తిరిగి వచ్చింది. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా నిందితులు ఆమెను వదల్లేదు. తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో పుణె పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మానవ అక్రమ రవాణా, మోసం, దోపిడీకి సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్


డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..

Updated Date - Aug 08 , 2026 | 04:30 PM