కర్ణాటకలో కుమ్ములాట.. కేబినెట్ విస్తరణ కోసం 31 మంది ఎమ్మెల్యేలు రాహుల్కు లేఖ
ABN , Publish Date - Feb 23 , 2026 | 07:01 PM
కర్ణాటకలో నాయకత్వ మార్పు కోసం జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో తమకు చోటు కల్పించాలని కోరుతూ తొలిసారి గెలిచిన 31 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి సోమవారంనాడు లేఖ రాశారు.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు కోసం జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో తమకు చోటు కల్పించాలని కోరుతూ తొలిసారి గెలిచిన 31 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి సోమవారంనాడు లేఖ రాశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అడ్రెస్ చేస్తూ ఎమ్మెల్యేలు ఈ లేఖ రాశారు.
'కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి 38 మంది కొత్త వారిని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపిన విషయం మీకు తెలుసు. తద్వారా అసెంబ్లీలో కొత్త వారిని చూడాలని అనుకుంటున్నట్టు ప్రజలు స్పష్టమైన సందేశాన్నిచ్చారు' అని అధిష్టానానికి రాసిన లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అయితే మంత్రివర్గంలో 34 మందికి చోటు కల్పించినప్పటికీ కొత్తగా ఎన్నికైన ఒక్క ఎమ్మెల్యేకు కూడా అవకాశం కల్పించలేదని అన్నారు. ఆ దృష్ట్యా తొలిసారి ఎన్నికైన సమర్ధత కలిగిన యువ ఎమ్మెల్యేలకు మంత్రులుగా సేవ చేసే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
పార్టీ అధిష్ఠానానికి రాసిన లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో ఏఎస్ పొన్నన్న, అశోక్ రాయ్, శ్రీనివాస్ ఎన్టీ, పి.రవికుమార్, ఏసీ శ్రీనివాస్, హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్, బి.దేవేంద్ర, నారా భరత్ రెడ్డి, విశ్వాస్ వి వైద్య, బసవరాజ్ వి శివగంగ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనార్ బంగ్లా సాకారం.. బెంగాల్ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ
తమిళనాడు ఎస్ఐఆర్ తుది జాబితా విడుదల.. 74 లక్షల మంది ఓటర్ల తొలగింపు