పడవ బోల్తా.. 10 మంది మృతి
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:18 PM
ఉత్తరప్రదేశ్ మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పది మంది యాత్రికులు మృతి చెందారు. పలువురు నదిలో గల్లంతయ్యారు.
లక్నో, ఏప్రిల్ 10: ఉత్తరప్రదేశ్ మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురు యాత్రికులు నదిలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. అవి కొనసాగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ సీపీ సింగ్ వెల్లడించారు. మథుర సమీపంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఈ పడవ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు.
శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కేసీ ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. పంజాబ్లోని లూథియానా నుంచి రెండు బోట్లలో భక్తులు వస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో భాగంగా 13 మందిని రక్షించామన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని జిల్లా మేజిస్ట్రేట్ సీపీ సింగ్ వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 25 నుంచి 30 మంది యాత్రికులు ఉన్నారన్నారు.
రాష్ట్ర విపత్తు స్పందన దళం, జాతీయ విపత్తు స్పందన దళంతోపాటు 50 మంది ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. మరోవైపు బలమైన గాలుల కారణంగా నది మధ్యలో ఉన్న పడవ తీవ్రంగా ఊగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వేగం పెరిగిన పడవ వంతెనను ఢీ కొట్టి బోల్తా పడిందని డీఎం సీపీ సింగ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
60 అడుగుల బోర్వెల్లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ
Read Latest National News And Telugu News