తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం.. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:13 AM
తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాత్తూర్లోని బాణసంచా కేంద్రంలో మంటలు చెలరేగాయి. మందుగుండు సామగ్రి పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
తమిళనాడు: విరుద్నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సాత్తూర్ సమీపం మడతుపట్టిలోని ఎక్సెల్ ఫైర్వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మందుగుండు సామగ్రి పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బాణసంచా కేంద్రంలో 60 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పలువురికి తీవ్రగాయాలు కాగా.. చాలా మంది కార్మికులు లోపలే ఉన్నట్లు తెలుస్తోంది.
కార్మికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా మృతిచెందారా, లేదా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీ యూటర్న్కు 30 నెలలు పట్టింది.. పార్లమెంటు ప్రత్యేక సమావేశంపై సోనియాగాంధీ ఫైర్
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఆరుగురి మృతి..