మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను చరిత్ర మరువదు: సోనియా గాంధీ
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:45 AM
కోల్ స్కామ్ కేసులో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్ స్కామ్ కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని సింగ్ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా, మృదుస్వభావిగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే ఆయన తన నైతికత, జవాబుదారితనంతో పూర్తి భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తారని అన్నారు.
ఈ తీర్పుతో భారత రాజకీయంలో ఒక విషాదకర ఘట్టానికి ముగింపు పడిందని వ్యాఖ్యానించారు. నీతినిజాయతీ కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడిందని వ్యాఖ్యానించారు. ‘దివంగత నేత మన్మోహన్ సింగ్కు వ్యతిరేకంగా ఒక లాబీ పూర్తిసన్నద్ధతతో, సమన్వయంతో పనిచేసింది. అధికార గణం మొదలు న్యాయవ్యవస్థకు చెందిన వారు, పౌర సమాజం, ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ ఉన్నారు. నాటి ఆరోపణలన్నీ బోగస్ అని నేడు రుజువైంది. డా. మన్మోహన్ సింగ్ నిర్దోషి అన్న విషయం స్పష్టంగా తేలింది’ అని ఓ జాతీయ వార్త పత్రికలోని వ్యాసంలో సోనియా గాంధీ రాసుకొచ్చారు.
ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఈడీ, సీబీఐ వంటి సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని కూడా ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. ‘వాటి లక్ష్యం ప్రత్యర్థులపై ఒత్తిడి తేవడమే. కొందరి గొంతు నొక్కారు. మరికొందరిని బీజేపీలో కలిపేసుకున్నారు. మరికొన్ని అసాధారణ సందర్భాల్లో కొందరికి మంత్రి పదువులు కూడా దక్కాయి’ అని సోనియా గాంధీ విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ దేశ పార్లమెంటు చరిత్రలో అత్యంత దిగజారిన క్షణంగా నిలిచిపోతాయని అన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులను క్షమిస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంలో తనని తాను క్షమించుకోవాలని చురకలంటించారు.
ఈ వార్తలనూ చదవండి:
యూపీఐ లావాదేవీలపై చార్జీలు ఉండవు
ఝార్ఖండ్లో విద్యార్థుల నిరసన.. అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం