భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:31 AM
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భూ ప్రకంపనలు మరోసారి వణికించాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం 5:59 గంటల ప్రాంతంలో మణిపూర్ సహా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో భూ ప్రకంపనలు సంభవించాయి.
మణిపూర్: ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భూ ప్రకంపనలు మరోసారి వణికించాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం 5:59 గంటల ప్రాంతంలో మణిపూర్ సహా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం మణిపూర్లోని కామ్జాంగ్ వద్ద ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 62 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అందరూ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే, ఏప్రిల్ నెలలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈనెల 7వ తేదీన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3, 3.0గా నమోదైంది. అయితే, వరుస భూ ప్రకంపనలతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
1805 కోట్ల ఉపాధి నిధులు విడుదల