Share News

ప్రజాస్వామ్య పండుగా, ప్రజల్ని చంపే పండుగా.. సీఆర్‌పీఎఫ్ భారీ బలగాలపై మమత ఫైర్

ABN , Publish Date - Apr 22 , 2026 | 09:06 PM

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో సీఆర్‌పీఎఫ్ సాయుధ వాహనాలను మోహరించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఇది ప్రజాస్వామ్య పండుగ, ఎవర్నీ చంపే పండుగ కాదు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య పండుగా, ప్రజల్ని చంపే పండుగా.. సీఆర్‌పీఎఫ్ భారీ బలగాలపై మమత ఫైర్
Mamata Banerjee

కోల్‌కతా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో సీఆర్‌పీఎఫ్ సాయుధ వాహనాలను మోహరించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banejee) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఇది ప్రజాస్వామ్య పండుగ, ఎవర్నీ చంపే పండుగ కాదు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా అన్ని ప్రభుత్వ విభాగాలను వాడుకుంటోందని ఆక్షేపణ తెలిపారు.


ఎవరు శక్తివంతులో చూద్దాం..

నార్త్ 24 పరిగణాల జిల్లాలో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్‌తో పాటు రైల్వేలు వంటి కేంద్ర సంస్థలను కూడా ఎన్నికల్లో మోహరించారని చెప్పారు. సాయుధ బలగాలు ఎలాంటి అకృత్యాలకు పాల్పడినా వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని టీఎంసీ మద్దతుదారులకు సూచించారు. బెంగాల్ ఎన్నికల కోసం సుమారు 2 లక్షల కేంద్ర బలగాలను తెచ్చారని, ఇది అసాధారణమని, ఇంతమంది భారీ బలగాలను తరలించడం ద్వారా తనను బెదిరించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. సాయుధ వాహనాల శక్తివంతమైనవో, ప్రజలు శక్తివంతమైనవారో తాను చూడాలనుకుంటున్నానని, బీజేపీకి మాత్రం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


మణిపూర్‌కు పంపండి..

అసాధారణ రీతిలో సాయుధ బలగాలను బెంగాల్‌లో దించడానికి బదులు మణిపూర్‌కు పంపాలని ప్రధానమంత్రి మోదీకి మమతాబెనర్జీ సవాలు విసిరారు. గత మూడేళ్లుగా మణిపూర్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని, అక్కడ ప్రధానమంత్రి, హోం మంత్రి బహిరంగ సభ నిర్వహించాలని సూచించారు. అప్పుడే బెంగాల్ ప్రజలు ఎంతో వైరుధ్యం కలవారో, ఎలాంటి శాంతియుత సహజీవనం కోరుకుంటారో వారికి అర్ధమవుతుందన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అమిత్‌షా ఇటీవల చేసిన హెచ్చరికలపై మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలిచి అప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే బాగుంటుందన్నారు. 'మీరు గెలిచే ఛాన్సే లేదు' అని మమత తెగేసిచెప్పారు.


ఇవి కూడా చదవండి..

పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు

సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 22 , 2026 | 09:06 PM