సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 07:09 PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ రాజణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రాజకీయ నిస్సహాయుడిగా ఉండటం చూస్తుంటే ఆయనపై ఎవరైనా చేతబడి చేసుండొచ్చని అనిపిస్తున్నట్టు చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)పై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ రాజణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రాజకీయ నిస్సహాయుడిగా ఉండటం చూస్తుంటే ఆయనపై ఎవరైనా చేతబడి చేసుండొచ్చని అనిపిస్తున్నట్టు చెప్పారు. సిద్ధరామయ్య నిస్సహాయతపై ఇంతకుముందు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న పార్టీ విధేయులను కాపాడుకోవడంలో సిద్ధరామయ్యగా నిస్సహాయుడిగా కనిపిస్తున్నారన్నారు. తాజాగా సిద్ధరామయ్యకు చేతబడి చేశారేమోనని అనిపిస్తున్నట్టు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై తాను మరింత లోతుగా విచారణ చేస్తానని చెప్పారు.
సిద్ధరామయ్య ఇలాంటి వాటిని నమ్మరని, నాస్తికుడని చెబుతారని మీడియా అడిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నాస్తికుడా, ఆస్తికుడా అనేది ఉండదని, తనకు కూడా చేతబడి మీద నమ్మకం లేదని, అయితే అది(చేతబడి) సాధ్యమేనని రాజణ్ణ సమాధానమిచ్చారు. కేరళలో ఇది ప్రబలంగా ఉందని అన్నారు. గతంలో తాను ఎన్నికల్లో నిలబడినప్పుడల్లా క్యాతసంద్రలోని తన ఇంటి చుట్టూ పసుపు నీళ్లు, నిమ్మకాయలు, గోళ్లు ఒక దారానికి కట్టి కనిపించేవని, అయితే తాను పట్టించునే వాడిని కాదని, దీని కారణంగా తాను ఎన్నికల్లో ఎప్పుడూ ఓడిపోలేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లు సీజ్
బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టనీయం: అమిత్షా