కర్ణాటక విజయపుర జిల్లాలో దారుణం.. ఆరుగురిని నరికి చంపిన ప్రత్యర్థులు..
ABN , Publish Date - May 30 , 2026 | 07:35 AM
కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా గోవిందపురలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదానికి సంబంధించి ప్రత్యర్థులు ఆరుగురిని హత్య చేశారు. పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా నరికి చంపారు.
కర్ణాటక: విజయపుర జిల్లా గోవిందపురలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదానికి సంబంధించి ప్రత్యర్థులు ఆరుగురిని హత్య చేశారు. పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన చడచాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమా నదీ పరివాహక ప్రాంతంలో జరిగింది. మృతులను గోవిందపుర గ్రామానికి చెందిన చందు నిరాలే (55), దుండప్ప నిరాలే (65), శివపుత్ర నిరాలే (58), రాహుల్ నిరాలే (25), సమర్థ నిరాలే (23), షబ్బీర్ నదాఫ్ (45)గా పోలీసులు గుర్తించారు.
ఈ దాడిలో అరవింద్ కటగే (72), సందీప్ మానే (33) అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిరాలే, గోలగి కుటుంబాల మధ్య భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీంతో శుక్రవారం నాడు గోలగి వర్గీయులు నిరాలే కుటుంబంపై దాడికి దిగారు. మరోవైపు, 2015లో జరిగిన ఓ హత్య కేసుతోనూ ప్రస్తుత దాడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందినప్పటికీ, మృతదేహాలను పరిశీలించగా ఎలాంటి తుపాకీ గాయాలు కనిపించలేదు.
చెరకు కోయడానికి ఉపయోగించే కోయితా అనే పదునైన ఆయుధాలతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి స్పందించారు. ఆరుగురి హత్య జరిగిన విషయాన్ని నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
వేశ్యావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు
‘ప్రైవేటు’లో 66శాతం సిజేరియన్లే!