Share News

ఇండిగో షాక్.. ఇంధనం సర్‌చార్జి పేరుతో ప్రయాణికులపై అదనపు భారం

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:43 PM

ఇండిగో సంస్థ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని ప్రకటించింది. ఆ ప్రకారం ప్రయాణికులకు ఒక్కో టిక్కెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం పడనుంది.

ఇండిగో షాక్.. ఇంధనం సర్‌చార్జి పేరుతో ప్రయాణికులపై అదనపు భారం
IndiGo

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం విమానయాన రంగంపై కూడా పడింది. విమాన ఇంధనం (ATF) ధరలకు రెక్కలు రావడంతో ఇంధనం సర్‌ఛార్జికి విమానయాన సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. తాజాగా ఇండిగో (IndiGo) సైతం అదే బాట పట్టింది. సంస్థ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని ప్రకటించింది. ఆ ప్రకారం ఒక్కో టిక్కెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం పడనుంది. తాజా ఛార్జీలు మార్చి 14 నుంచి అమల్లోకి వస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.


మద్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఇంధనం ధరలు పెరగడంతో సర్‌ఛార్జి నిర్ణయం తీసుకున్నట్టు ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంధనం ధరల్లో పెరుగుదల 85 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ జెట్ ఫ్యూయల్ మోనిటర్‌ తెలిపినట్టు పేర్కొంది. ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ కాస్ట్‌లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కీలకమని, ఇంధనం ధరల్లో అనూహ్య పెరుగుదలతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్ప మొత్తంలో ధరలను సర్దుబాట్లు చేసినట్టు చెప్పింది.


రూట్..ఫ్యూయల్ ఛార్జీ

అమల్లోకి రానున్న రూట్లు, విమాన చార్జీల వివరాల ప్రకారం, దేశీయ ప్రయాణం టిక్కెట్లపై రూ.425 వసూలు చేస్తారు. మధ్యప్రాచ్యం వెళ్లే విమాన టిక్కెట్‌పై రూ.900, చైనా, ఆగ్నేయాసియా వెళ్లే విమానాలకు రూ.1,800, ఆఫ్రికా, పశ్చిమాసియాకు వెళ్లే విమానాలకు రూ.1,800, యూరప్ వెళ్లే విమానాలకు రూ.2,300 చొప్పున ఫ్యూయల్ చార్జీలు వసూలు చేస్తారు.


ఇవి కూడా చదవండి..

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

Updated Date - Mar 13 , 2026 | 09:48 PM