Share News

భారత్‌కు చేరుకోనున్న ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:50 PM

రష్యా నుంచి భారత్‌కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్‌ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు.

భారత్‌కు చేరుకోనున్న ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్‌

ఢిల్లీ: రష్యా నుంచి భారత్‌కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్‌ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రష్యా నుంచి ఎస్-400 ట్రియంఫ్ బయలుదేరినట్లు వెల్లడించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్‌ భారత్‌కు చేరితే దేశ వైమానిక దళ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.


అక్టోబర్‌ 2018లో అధునాతన ఎస్-400 క్షిపణి వ్యవస్థకు చెందిన ఐదు యూనిట్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే మూడు ఎస్-400 యూనిట్లను భారత్‌కు రష్యా అందించింది. మే నెల మెుదటి వారంలో నాలుగోది మన దేశానికి రానుంది. చివరిది అయిన ఐదో యూనిట్ నవంబర్ నాటికి రష్యా అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎస్-400 క్షిపణి వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.


గత నెలలో రష్యా నుంచి మరో ఐదు ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం అన్ని డెలివరీ అయితే దేశంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థల సంఖ్య 10కి చేరుతుంది. అయితే, తాజా కొనుగోళ్లను అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. 'కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్' (CAATSA) నిబంధనల ప్రకారం భారత్ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. 2018లోనే ఒప్పందం జరిగిందని.. తాజా కొనుగోళ్లు ఏడేళ్ల కిందటి ఆర్డర్లకు కొనసాగింపని అధికారులు చెబుతున్నారు.


అమెరికా ఆంక్షలతో భారత్‌కు ఆటంకాలు ఎదురవుతాయని తాము భావించడం లేదని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 క్షిపణి వ్యవస్థలు సత్తా చాటాయి. శత్రుదేశం పాక్ యుద్ధ విమానాలకు చుక్కలు చూపించాయి. ఈ కారణంగానే మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు కొనుగోలు చేయాలని భారత్ భావించింది.


ఈ వార్తలు కూడా చదవండి

కొడైకెనాల్‌లో సైక్లింగ్‌తో సందడి చేసిన సీఎం స్టాలిన్

బెంగళూరులో దారుణం.. రక్తపు మడుగులో నగ్నంగా యువతి మృతదేహం..

Updated Date - Apr 28 , 2026 | 04:56 PM