దేశ ద్రోహులకు భారతదేశం ధర్మశాల కాదు.. యోగి ఆదిత్యనాథ్
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:17 PM
దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని వారికి భారతదేశం ఎంతమాత్రం ధర్మశాల కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
లఖ్నవూ: దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని వారికి భారతదేశం ఎంతమాత్రం ధర్మశాల (Shelter) కాదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లఖ్నవూలో మంగళవారంనాడు జరిగిన శ్రీరామకథా మహోత్సవం ముగింపు వేడుకలో ఆయన మాట్లాడుతూ, శ్రీరాముని ఆదర్శాలు యావద్దేశాన్ని ఏకం చేస్తున్నాయని చెప్పారు.
'భారతదేశం ఎంతమాత్రం ధర్మశాల కాదు. దేశ సంస్కృతి, వారసత్వం, విలువలను గౌరవించే వాళ్లు మాత్రమే ఇక్కడ గౌరవప్రదంగా జీవించవచ్చు. భారతదేశ స్ఫూర్తి, సంప్రదాయాలను అంగీకరించని వాళ్లకి ఇక్కడ స్థానం లేదు' అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామాయణ కాలానికి, నవీన భారతానికి మధ్య సారూప్యాన్ని వివరిస్తూ, దుష్టశక్తులు అధికారంలో ఉన్నప్పుడల్లా రాక్షసరాజు రావణాసురిడి కాలంలో ఏవిధంగా దుష్టశిక్షణ జరిగిందో అదే పునరావృతమవుతుందని అన్నారు.
దేశంలోని జనాభా మార్పు కోసం జరుగుతున్న కుట్రలో భాగమే 'లవ్ జిహాద్' అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రామాయణ కాలంలో కూడా ఖాళీగా ఉన్న భూములను మారీచుడు, ఖరదూషణాది రాక్షసులు దురాక్రమణ చేసేవారని, ల్యాండ్ జిహాద్కు పాల్పడేవారని అన్నారు. ప్రతి యుగంలోనే దుష్టశక్తులు ఉంటాయని, అయితే సత్యం, మతం పరిరక్షణకు శ్రీరాముడు ఏవిధంగా పాటుపడ్డారో అందరూ తెలుసుకుని కర్తవ్యబద్ధులుకావాలని, అంతా ఐక్యంగా నిలవాలని అన్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్