Share News

అమెరికాను దాటేయనున్న భారత్.. రెండేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్..

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:54 PM

మెట్రో రైలు రంగంలో భారత్‌ మరో భారీ మైలురాయిని అందుకోబోతోంది. రాబోయే రెండేళ్లలో అమెరికాను వెనక్కి నెట్టి.. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా భారత్‌ అవతరించనుంది.

అమెరికాను దాటేయనున్న భారత్.. రెండేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్..
India metro rail network

ఇంటర్నెట్ డెస్క్: మెట్రో రైలు రంగంలో భారత్‌ మరో భారీ మైలురాయిని అందుకోబోతోంది. రాబోయే రెండేళ్లలో అమెరికాను వెనక్కి నెట్టి.. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా భారత్‌ అవతరించనుంది. ఈ విషయాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు (India metro rail network).


ఒకప్పుడు కేవలం కొన్ని నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ఇప్పుడు దేశంలోని 26 నగరాలకు విస్తరించాయని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో కొత్త మార్గాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానుండటంతో భారత్‌ మెట్రో నెట్‌వర్క్‌ మరింత వేగంగా పెరగనుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో దేశంలో కేవలం 5 నగరాల్లో 245 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో రైలు మార్గాలు అందుబాటులో ఉండేవని మనోహర్ లాల్ గుర్తుచేశారు (US metro rail network).


ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, దేశవ్యాప్తంగా 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 12 ఏళ్లలోనే దేశ మెట్రో నెట్‌వర్క్‌ దాదాపు ఐదు రెట్లు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు పెద్దపీట వేయడంతో కొత్త నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు (India metro expansion).


భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా ఉంది. చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు పూర్తవుతూ, నిర్మాణంలో ఉన్న మార్గాలు అందుబాటులోకి వస్తే రెండేళ్లలో అమెరికాను భారత్‌ అధిగమించే అవకాశం ఉందని మనోహర్ లాల్ అన్నారు. 'రాబోయే రెండేళ్లలో అమెరికాను అధిగమించి.. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని భావిస్తున్నాను' అని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ట్రక్కు.. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..


9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..

Updated Date - Sep 05 , 2026 | 09:54 PM