హోర్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:51 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో భారతీయ నావికుడు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఆంధ్రజ్యోతి, జులై 29: పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతల నడుమ.. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో భారతీయ నావికుడు ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక చర్యలను తక్షణమే నిలిపివేసి, ఉద్రిక్తతలను తగ్గించాలని విజ్ఞప్తి చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ స్పందన
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పశ్చిమాసియా పరిస్థితులపై జరిగిన బహిరంగ చర్చలో ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడారు. కొద్దిపాటి విరామం తర్వాత ప్రాంతీయంగా మళ్లీ హింస, ప్రతిదాడులు చెలరేగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో హోర్ముజ్ జలసంధి దాటుతున్న 'GFS గెలాక్సీ', యుఏఈ పతాకంతో ప్రయాణిస్తున్న 'MT అల్ బహియా', 'MT మొంబాసా' నౌకలపై జరిగిన దాడులు నేరుగా భారతీయులపై ప్రభావం చూపాయన్నారు. ఈ దాడుల్లో భారతీయ నావికుడు మరణించగా, మరొకరు అదృశ్యమయ్యారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సభ దృష్టికి తీసుకెళ్లారు. అంతర్జాతీయ జలసంధుల గుండా ఉచిత, సురక్షితమైన వాణిజ్య నౌకల రాకపోకలకు భంగం కలిగించకూడదని, పౌర నౌకలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ రాయబారికి సమన్లు
తమ పౌరుడి మృతి, ఇతరులు గాయపడటానికి నిరసనగా భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్కు సమన్లు జారీ చేసి, తన తీవ్ర దౌత్యపరమైన నిరసనను వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News