ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. నిరసనకు దిగిన తోటి విద్యార్థులు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 08:45 AM
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. శుక్రవారం జరిగిన పరీక్షల్లో ఫోన్ వాడుతూ విద్యార్థి పట్టుబడటంతో కళాశాల యాజమాన్యం మందలించింది. అనంతరం తన రూమ్కి వెళ్లిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో క్యాంపస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ముంబై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay)లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. శుక్రవారం జరిగిన పరీక్షల్లో ఫోన్ వాడుతూ విద్యార్థి పట్టుబడటంతో ప్రొఫెసర్ మందలించారు. అనంతరం తన రూమ్కి వెళ్లిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో క్యాంపస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై ఐఐటీ బాంబే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు మాత్రం ఆందోళనకు దిగారు. క్యాంపస్లో విద్యార్థుల వరుస మరణాలపై కచ్చితమైన కారణాలను తెలియజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

ఐఐటీ బాంబే ఏం చెప్పిందంటే..
‘ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి పరీక్షల సమయంలో ఫోన్ వాడుతూ పట్టుబడ్డాడు. ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు విద్యార్థి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇన్స్ట్రక్టర్, విభాగాధిపతి విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అతనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన విద్యార్థి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపదనీ అధికారులు భరోసా ఇచ్చారు. అయినా హాస్టల్ గదికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతిపై ఐఐటీ బాంబే తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అంటూ ప్రకటన జారీ చేసింది.

అయితే, ఈ ఘటనపై ఐఐటీ బాంబేలో పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత, స్పష్టమైన సమాధానాలు కోరుతూ నిరసన చేపట్టారు. క్యాంపస్లో విద్యార్థులు తరచూ ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు క్యాంపస్లో పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు, విద్యార్థులతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్చలు జరిపింది. మృతిచెందిన విద్యార్థికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చింది. కాగా, విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
భర్తతో తరచూ గొడవలు.. ప్రియుడితో కలిసి హత్య..
శశి థరూర్ పోస్ట్లో గ్రామర్ మిస్టేక్.. నెటిజన్ల షాక్