ఢిల్లీ వర్సిటీ ఎన్నికలు.. కీలక పదవులు ఏబీవీపీకే
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:17 PM
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ 2026 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ABVP అత్యధిక స్థానాలను గెలుచుకుని తన ఆధిక్యాన్ని చాటుకుంది. ప్రెసిడెంట్ సహా మూడు కీలక స్థానాలను కైవసం చేసుకుంది.
ఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (DUSU) 2026 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) అత్యధిక స్థానాలను గెలుచుకుని తన ఆధిక్యాన్ని చాటుకుంది. ప్రెసిడెంట్ సహా మూడు కీలక స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకోగా, వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకోవడం విశేషం.
ఎన్నికల ఫలితాల వివరాలు

ప్రెసిడెంట్: ఏబీవీపీకి చెందిన యాష్ దబాస్ 24,576 ఓట్లతో విజయం సాధించారు. ఎన్ఎస్యుఐ (NSUI) అభ్యర్థి విజయ్ మీనా (22,523 ఓట్లు) పై ఆయన 2,053 ఓట్ల మెజారిటీతో ప్రెసిడెంట్గా గెలుపొందారు.
వైస్ ప్రెసిడెంట్: స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 30,615 ఓట్లు సాధించి, ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్యపై ఏకంగా 13,705 ఓట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేశారు.
సెక్రటరీ: ఏబీవీపీ అభ్యర్థి రియా ఛావ్డీ 21,650 ఓట్లు సాధించి, ఎన్ఎస్యుఐ అభ్యర్థి నమ్రతా చౌదరిపై 6,781 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
జాయింట్ సెక్రటరీ: ఏబీవీపీకి చెందిన లక్ష్య రాజ్ సింగ్ 16,641 ఓట్లు సాధించి, స్వతంత్ర అభ్యర్థి విశేష్ యాదవ్ పై 863 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
డియూ వ్యాప్తంగా ఉన్న 52 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1.51 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉండగా, ఈసారి 40.46 శాతం పోలింగ్ నమోదైంది. ప్రచార సమయంలో గొడవలు, హింసాత్మక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు ఢిల్లీ హైకోర్టు కఠిన నిబంధనలు విధించింది. విజయోత్సవ ర్యాలీలు, డప్పులు, వేడుకలపై కోర్టు నిషేధం విధించడంతో భారీ భద్రత నడుమ కౌంటింగ్ నిర్వహించారు. ఈ విజయంతో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతన DUSU సెంట్రల్ ప్యానెల్ బాధ్యతలు స్వీకరించనుంది.
ఇవి కూడా చదవండి...
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
హఫీజ్పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్పై వేటు
Read Latest Telangana News And Telugu News