2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
ABN , Publish Date - Aug 31 , 2026 | 03:28 PM
ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్వాదీ పార్టీ కీలక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్గా ఉన్న ముస్లిం-యాదవ్ సమీకరణానికి మహిళా ఓటర్లను కూడా చేర్చే దిశగా అడుగులు వేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్వాదీ పార్టీ కీలక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్గా ఉన్న ముస్లిం-యాదవ్ సమీకరణానికి మహిళా ఓటర్లను కూడా చేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, మైన్పురి ఎంపీ డింపుల్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది (2027 Uttar Pradesh elections).
2017లో కుటుంబ రాజకీయాల ఆరోపణల నేపథ్యంలో డింపుల్ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయరని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. డింపుల్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె సమాజ్వాదీ పార్టీకి ప్రధాన మహిళా ముఖంగా ఎదిగారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మహిళా ఓటర్లు కీలక వర్గంగా మారుతున్నారు. అయితే ఈ విషయంలో సమాజ్వాదీ పార్టీకి గతంలో బలహీనత ఉంది (SP election strategy Dimple Yadav).
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం, ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి కంటే బీజేపీకి 13 శాతం ఎక్కువగా మహిళా ఓటర్ల ఆదరణ లభించింది. అలాగే సమాజ్వాదీ పార్టీ గత ప్రభుత్వాల శాంతిభద్రతల రికార్డును బీజేపీ తరచూ మహిళల భద్రతతో ముడిపెడుతోంది. ఈ విమర్శలకు డింపుల్ యాదవ్ ద్వారా సమాధానం చెప్పాలని ఎస్పీ భావిస్తున్నట్లు సమాచారం (Uttar Pradesh politics).
ఆగస్టు 26న లక్నోలో జరిగిన కార్యక్రమంలో డింపుల్ యాదవ్ 'స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన'ను ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అర్హత ఉన్న మహిళలకు ఏడాదికి రూ.40,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు (Women voters in UP). మహిళలకు కేవలం హామీలు ఇవ్వడం కాకుండా వారికి రాజకీయ ప్రాతినిధ్యం, గౌరవం, ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని డింపుల్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో డింపుల్ యాదవ్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై కూడా మరింత బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్లు, పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, మహిళల భద్రత, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలను ఆమె ప్రస్తావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్పై ఎంపీ మాగుంట సీరియస్