లోక్సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:10 PM
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్సభ స్థానాల పునర్విభజన విషయంలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో భరోసా ఇచ్చారు.
న్యూఢిల్లీ ఏప్రిల్ 16: దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్సభ స్థానాల పునర్విభజనపై నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ (గురువారం) లోక్సభలో భరోసా ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలుకు సంబంధించి లోక్సభలో జరిగిన చర్చలో మంత్రి కీలక వివరాలను వెల్లడించారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం, లోక్సభలోని ప్రస్తుత సభ్యుల సంఖ్యను 543 నుంచి 815 కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన స్థానాల్లో 33 శాతం చొప్పున మొత్తం 272 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా అన్ని రాష్ట్రాల్లోని స్థానాలను దాదాపు 50 శాతం మేర పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్లను 2029 సాధారణ ఎన్నికల నుంచే అమలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మేఘ్వాల్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన బిల్లులను సభ ముందు ఉంచింది:
1. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026
2. డీలిమిటేషన్ (పునర్విభజన) బిల్లు, 2026
3. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026
'మహిళల పురోగతి ఆధారంగా ఒక సమాజం పురోగతిని నేను కొలుస్తాను' అని చెప్పిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాటలను ఈ సందర్భంగా మంత్రి ఉటంకించారు.
మరోవైపు, ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు భిన్న స్వరాలు వినిపించాయి. పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రమాదం ఉందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కుల గణన ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి.
ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 17) సాయంత్రం 4 గంటలకు ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే, భారత పార్లమెంటరీ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద నిర్మాణాత్మక మార్పుగా నిలిచిపోనుంది.
ఇవి కూడా చదవండి...
ఆ విషయాల్లో మహిళల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు: పవన్ కల్యాణ్
ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని తండ్రి పన్నాగం
Read Latest Telangana News And Telugu News