'నాన్న , మీరు గర్వపడేలా చేస్తా'.. కొడుకు చివరి మాటలకు తండ్రి కన్నీరు!
ABN , Publish Date - Sep 07 , 2026 | 04:00 PM
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఇప్పటికే ఏడుగురు మరణించారు. సుమారు 50 మంది వరకూ విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన అక్షత్ అనే విద్యార్థి తండ్రి.. తన కుమారుడి మాటలు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 07: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిన్న ఐదంతస్తుల భవనం కూలిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వారిలో మధ్యప్రదేశ్కు చెందిన అక్షత్ సింగ్ అనే విద్యార్థి ఒకరు. అతను ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పీజీడీఏవీ కాలేజ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొడుకు మరణ వార్త తెలిసి మధ్యప్రదేశ్ కట్నీలో నివాసం ఉంటున్న అక్షత్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి అక్షత్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కూడా కంటతడి పెట్టించింది. ఇక అక్షత్ సోదరి అయితే తమ్ముడి మృతదేహాం చూసి.. స్పృహ కోల్పోయారు.
అక్షత్ తండ్రి రాజస్థాన్లోని కోటాలో పనిచేస్తుండగా, తల్లి గృహిణి. అతడు చదువులో ముందుంటాడని, పుస్తకాలు చదవడం, క్విజ్ పోటీల్లో పాల్గొనడం అంటే అతనికి ఎంతో ఇష్టమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు కొనేవాడని, ఐఏఎస్ కావాలనేది అతని కోరికని అక్షత్ బంధువులు వెల్లడించారు. 'నాన్నా, భవిష్యత్లో ఒక రోజు నేను పెద్ద ఆఫీసర్నై నిన్ను గర్వపడేలా చేస్తా' అని తనకు తరచూ చెప్పే వాడంటూ అక్షత్ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందే అక్షత్.. తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడాడు. అవే చివరి మాటలు అవుతాయని ఆ తల్లి కలలో కూడా ఊహించలేదు. 'నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసిన బిడ్డ విగతజీవిగా పడివుండటం చూసి తట్టుకోలేకపోతున్నాను' అంటూ అక్షత్ తల్లి గుండెలు పగిలేలా రోధించారు. ఇటీవలే రాఖీ పండుగకు ఇంటికి వెళ్లిన అక్షత్.. సోదరికి రక్షబంధన్ కట్టి తిరిగి ఢిల్లీ చేరుకున్నాడు.
ఇంతంలోనే భవనం కూలిన ఘటనలో విగత జీవిగా మారాడు. అక్షత్ తండ్రి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భవనాలను ఎందుకు తనిఖీ చేయరని ఆయన ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యమే తన బిడ్డ ప్రాణాలను బలితీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
యువత భవిష్యత్తుతో రాజకీయం తగదు.. వైసీపీకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్
జాన్ హార్వర్డ్ విగ్రహంలోని 3 తప్పులు ఇవే! నిజం తెలిస్తే షాక్ అవుతారు