చలో సంసద్ యాత్రకు అనుమతి లేదు: ఢిల్లీ పోలీసులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 08:30 PM
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రేపు (సోమవారం) తలపెట్టిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఆ పార్టీ ప్రతిపాదించిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి కోరలేదు.. తాము ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
న్యూఢిల్లీ, జులై 19: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రేపు (సోమవారం) తలపెట్టిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఆ పార్టీ ప్రతిపాదించిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి కోరలేదు.. తాము ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 (పాత CrPC సెక్షన్ 144) అమల్లో ఉందని వివరించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుంపుగా ఉండకూడదని, ర్యాలీలు, నిరసనలు, ఊరేగింపులు నిషేధమని స్పష్టం చేశారు. అయితే జంతర్ మంతర్లో ముందస్తు అనుమతితో నిరసనలు నిర్వహించకోవచ్చని తెలిపారు.
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై BNS సెక్షన్ 223తో పాటు ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని గౌరవించాలని, అనధికారిక ర్యాలీలు లేదా గుమికూడవద్దని ప్రజలకు సూచించారు. శాంతి - భద్రతల పరిరక్షణకు సహకరించాలని దేశ రాజధానిలోని ప్రజలకు ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఢిల్లీ నగరవ్యాప్తంగా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా కీలక ప్రదేశాల్లో అదనపు బారికేడ్లు, వాహనాల తనిఖీలు, పికెట్లు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. జంతర్మంతర్ వద్ద నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ను శనివారం పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. జులై 20న జరిగే ఈ చలో సంసద్ యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చిన విషయం విదితమే.
ఈ యాత్ర యథావిధిగా జరుగుతుందని కాక్రోజ్ జనతా పార్టీ నేత డిప్కే ప్రకటించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ఈ చలో సంసద్ నిర్వహించాలని కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయించింది. అయితే జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, శంకర్ చౌక్, కన్నాట్ ప్లేస్తో సహా సున్నితమైన ప్రాంతాలల్లో భద్రతను పటిష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో ముందస్తుగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..
For More National News And Telugu News