Share News

లీకేజీలకు పాల్పడితే ఇక అంతే.. నేటి కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:02 PM

పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024' చట్టానికి సవరణలు చేసేందుకు ఇవాళ్టి కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

లీకేజీలకు పాల్పడితే ఇక అంతే.. నేటి కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

ఢిల్లీ, జులై 24: NEET, JEE వంటి పోటీ పరీక్షల్లో వరుస పేపర్ లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024' చట్టానికి సవరణలు చేసేందుకు ఇవాళ్టి కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.


ప్రతిపాదిత కొత్త సవరణలు:

1. సుదీర్ఘ జైలు శిక్షలు, భారీ జరిమానాలు: ప్రస్తుతం ఉన్న జైలు శిక్షా కాలాన్ని మరింత పెంచడంతో పాటు, ఆర్థిక జరిమానాలను భారీగా పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

2. కాలపరిమితితో కూడిన విచారణ (Time-Bound Trials): పేపర్ లీకేజీ కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగకుండా, ఏడాది లేదా అంతకంటే తక్కువ వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి బాధ్యులకు వేగంగా శిక్ష పడేలా నిబంధనలు తీసురానున్నారు.

3.ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు: విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.


ప్రస్తుతం ఉన్న చట్టం ఏం చెబుతోంది?

2024 జూన్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడితే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అదే గ్యాంగ్‌లు/వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా లీకేజీలకు పాల్పడితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఇప్పుడు ఈ శిక్షలను మరింత కఠినతరం చేయనున్నారు.


మరొకవైపు, పరీక్షల విధానంలో సంస్కరణలు, నీట్ లీకేజీపై విచారణ డిమాండ్‌తో 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం రాత్రి తన దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయనను కలిసి ప్రభుత్వం తరఫున హామీ పత్రాన్ని అందజేశారు.

ప్రభుత్వం ఇచ్చే ప్రధాన హామీలు:

సభలో విస్తృత చర్చ: ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పేపర్ లీకేజీలు, విద్యా సంస్కరణలపై సమగ్ర చర్చ జరుపుతామని హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం: నీట్ పేపర్ లీక్ ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

శాంతియుత నిరసనకారులపై కేసులు నమోదు చేయరు: శాంతియుతంగా ఆందోళన తెలిపిన విద్యార్థులు, యువతపై ఎలాంటి కేసులు పెట్టబోమని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.


సభలో విపక్షాల ఆందోళనలు, బయట విద్యార్థుల నిరసనల నడుమ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం ద్వారా విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Updated Date - Jul 24 , 2026 | 01:03 PM