మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన పథకం పొడిగింపు.. కేంద్ర కేబినెట్ నిర్ణయం
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:58 PM
అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మోదీ ప్రభుత్వం పొడిగించింది. ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, జనవరి 21: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరికొన్నేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి మరింత విస్తృతి కల్పించడంతో పాటు మరింత అభివృద్ధికి ఖర్చు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది అంటే.. 2026 జనవరి 19 నాటికి ఈ పథకంలో 8.66 కోట్ల మంది చందాదారులుగా చేరారు.
ప్రభుత్వ ఉద్యోగులు రిటైరైన తర్వాత.. వారికి పెన్షన్ అందుతుంది. కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అలాంటి అవకాశాలుండవు. దీనిని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం 2015లో 60 ఏళ్లు దాటిన కార్మికుల కోసం.. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ అందుకునే అవకాశాన్ని అసంఘటిత కార్మికులకు కల్పించింది. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరాన్కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..
పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
For More National News And Telugu News