ప్రతిపక్షాలది అరాచక మనస్తత్వం: బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:02 PM
పార్లమెంట్ సమావేశాలను వరుసగా అడ్డుకుంటూ, విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్షాల ఈ తరహా ధోరణి వారి 'అరాచక మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.
ఢిల్లీ, ఆగస్టు 12: పార్లమెంట్ సమావేశాలను వరుసగా అడ్డుకుంటూ, కీలకమైన ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్షాల ఈ ధోరణి వారి 'అరాచక మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.
ప్రతిపక్షాల తీరుపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన నితిన్ నబీన్.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతీ ముఖ్యాంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు సభను నడవనీయకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రజలందరూ ఈ పరిణామాలను గమనిస్తున్నారని, చర్చల నుంచి ఎవరు పారిపోతున్నారో దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.
హోం మంత్రి అమిత్ షా సవాల్
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విపక్షాల వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పార్లమెంట్లో ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని, అయితే ప్రతిపక్షాలు అర్థవంతమైన చర్చలు జరపకుండా గందరగోళం సృష్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. విపక్షాలకు చర్చపై నిజంగా ఆసక్తి ఉంటే లోక్సభ స్పీకర్కు లేఖ ఇవ్వాలని, ఈ (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరాయంగా చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
కాగా, గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వంతో సజావుగా సాగడం లేదు. ప్రతిపక్షాలు తమకు నచ్చిన అంశాలపై చర్చకు పట్టుబడుతూ నిరసనలకు దిగుతుండగా, పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వం సూచిస్తోంది. తాజా ఆరోపణలు, సవాళ్లతో అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి...
వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
Read Latest AP News And Telugu News