పశ్చిమ బెంగాల్లో దారుణ హత్య.. సువేందు అధికారి పీఏపై కాల్పులు..
ABN , Publish Date - May 07 , 2026 | 06:47 AM
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడిని గుర్తుతెలియని దుండగలు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడిని గుర్తుతెలియని దుండగలు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మధ్యమ్గ్రామ్ ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు అతి సమీపం నుంచి చంద్రనాథ్ రథ్పై కాల్పులు జరిపారు.
చంద్రనాథ్ కారులో ఉండగా వచ్చిన నిందితులు.. డోర్ గ్లాస్ పైనుంచే మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే చంద్రనాథ్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా.. దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగాల్ని బీజేపీ కైవసం చేసుకున్న 24 గంటల్లోనే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది.
మరోవైపు రథ్ హత్య ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సువేందు అధికారి సహా పలువురు అగ్రనేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సువేందు అధికారి హత్యకు కుట్ర జరిగిందని రాజ్యసభ ఎంపీ రాహుల్ సిన్హా ఆరోపించారు. మంగళవారం కూడా పశ్చిమ బెంగాల్లో మరో హత్య ఘటన వెలుగు చూసింది. రాజర్హాట్-న్యూటౌన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అయితే, దీనికి టీఎంసీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు వెళ్తా
సీఈసీ నియామకంపై పార్లమెంటును ఆదేశించవచ్చా?