పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. మూడు లైన్ల విప్ జారీ చేసిన బీజేపీ
ABN , Publish Date - Apr 12 , 2026 | 06:02 PM
ఈనెల 16,17,18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా ఈ సమావేశాల సమయంలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్లో కోరింది.
న్యూఢిల్లీ: ఈనెల 16,17,18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ (BJP) మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా ఈ సమావేశాల సమయంలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్లో కోరింది. కేంద్ర మంత్రులతో సహా ఎంపీలంతా ఈ మూడు రోజులు సభలోనే ఉండాలని, ఎలాంటి సెలవులు మంజూరు చేసేదిలేదని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ పేర్కొంది.
ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై దృష్టి పెట్టడం, రిజర్వేషన్ అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే అవకాశం ఉంది. జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని నారీశక్తి వందన్ అధినయం-2023 చెబుతోంది. అయితే జనగణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని కేంద్రం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 2029 లోక్సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లు అమలయ్యేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని ఎంపీలను ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన లేఖ రాశారు. 16వ తేదీ నుంచి నారీ శక్తి వందన్ అధినియంపై చారిత్రక చర్చ జరుగుతుందని, ఈ ప్రత్యేక సమావేశం మన ప్రజాస్వామ్య మరింత పటిష్టం చేసే అవకాశమవుతుందని చెప్పారు. సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ పార్లమెంటు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటుందనే గట్టి నమ్మకం తనకుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు మోదీ లేఖ
ఎన్నికల వేళ ఎందుకీ తొందర... మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీకి ఖర్గే ఘాటు లేఖ