బీజేపీకి నిధుల వరద
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:16 AM
ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1473 కోట్లు విరాళాలు అందుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి తన...
5 రాష్ట్రాల ఎన్నికల్లో 1473 కోట్లు
కాంగ్రె్సకు 207 కోట్లు మాత్రమే
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1473 కోట్లు విరాళాలు అందుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి తన కేంద్ర, రాష్ట్రాల కార్యాలయాల ద్వారా రూ.207 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రెండు పార్టీలు సమర్పించిన వ్యయ నివేదికల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. దీన్నిబట్టి కాంగ్రెస్ కంటే బీజేపీకి ఏడు రెట్లు ఎక్కువ నిధులు వచ్చాయి. తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలకు సంబంధించిన వ్యయ నివేదికను కాంగ్రెస్ ఇదివరకే ఈసీకి సమర్పించింది. ఈ ఎన్నికల సమయంలో మార్చి 15 నుంచి మే 6 వరకు కాంగ్రె్సకు రూ.207.17 కోట్లు విరాళాలు రాగా, 248.55 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఈసీకి బీజేపీ సమర్పించిన వ్యయ వివరాల ప్రకారం.. ఈ సమయంలో ఆ పార్టీకి కేంద్ర కార్యాలయంలోనే రూ.1472.8 కోట్లు విరాళాలు అందాయి. అయితే అసోం, పుదుచ్చేరి, తమిళనాడుకు సంబంధించి బీజేపీ వ్యయ నివేదికలు మాత్రమే బహిర్గతం చేసింది. కేరళం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల వ్యయ నివేదికలు(రశీదులు) ఇంకా బహిర్గతం చేయలేదు. దీంతో ఆ పార్టీ సమగ్ర ఆదాయం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. మార్చి 15న బీజేపీ ఖాతాలో రూ.6722 కోట్లు ఉండగా, మే 6 నాటికి రూ.7627 కోట్లు ఉన్నాయి. అంటే.. ఎన్నికల సమయంలో బీజేపీకి నిధులు రూ.904 కోట్లు పెరిగాయి. మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిధులు తగ్గాయి. ఎన్నికల ఆరంభంలో నగదు, బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.169 కోట్లు ఉండగా, ఎన్నికలు పూర్తయ్యేసరికి రూ.103 కోట్లు నిల్వ ఉన్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ నిధులు రూ.65 కోట్లు తగ్గాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News