ఘోర ప్రమాదం.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా నలుగురి మృతి..
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:30 PM
బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
కర్ణాటక: బెంగళూరు- మైసూరు జాతీయ రహదారి(Bengaluru Mysuru Highway)పై ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన(Road Accident) ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. కేరళ నుంచి బెంగళూరుకు బస్సు వెళ్తుండగా బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్న సమీపంలోని సంకలగెరె గ్రామం పుట్టప్పనదొడ్డి వద్ద ప్రమాదం జరిగింది.
మృతుల్లో కేరళలోని కోజికోడ్కు చెందిన మహమ్మద్ ఫరాన్, సుల్ఫీ ఉండగా.. బెంగళూరు వాసులు రషీద్, సాకిర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చన్నపట్న ప్రభుత్వాస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం, కేరళ రాష్ట్రం కోజికోడ్ నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున సుమారు 4.30 గంటలకు డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుకు ఎడమ వైపున ఉన్న ఇనుప రెయిలింగ్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు సుమారు 100 మీటర్ల దూరం రెయిలింగ్ను రాసుకుంటూ వెళ్లిపోయింది. మెుత్తం 36మంది ప్రయాణికుల్లో నలుగురు చనిపోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ వాదించినప్పటికీ అతని వాదనలను పోలీసులు కొట్టిపారేశారు. సీసీటీవీ ఫుటేజీ పలిశీలించగా డ్రైవర్ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలిందని ఆ పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి డ్రైవర్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాకిస్థాన్కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్
ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలు!