Share News

అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన అస్సాం సర్కార్

ABN , Publish Date - May 25 , 2026 | 04:41 PM

అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పౌర స్మృతి బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో సోమవారంనాడు ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని నిషేధించడం, బాల్యవివాహాలను అడ్డుకోవడం, సహజీవనానికి, రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేయడం, విడాకులు, వారసత్వానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం.

అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన అస్సాం సర్కార్
Himanta Biswa Sharma

గువాహటి: అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో సోమవారంనాడు ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని (Pologamy) నిషేధించడం, బాల్యవివాహాలను అడ్డుకోవడం, సహజీవనానికి (live-in-relationships) రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేయడం, విడాకులు, వారసత్వానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున 'ది యూనిఫాం సివిల్ కోడ్, అస్సాం, 2026 బిల్లును' పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.


'వివాహం, విడాకులు, లివ్-ఇన్ రిలేషన్‌కు సంబంధించిన చట్టాలను ఏకీకరించి, సరళీకరించడం ఈ బిల్లు లక్ష్యం. పురుషులకు వివాహ వయస్సు కనిష్టంగా 21 ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు. బహుభార్యాత్వాన్ని నిరోధిస్తుంది ' అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ బిల్లులో వివరించారు. తొలిసారి లివ్-ఇన్‌ రిలేషన్‌షిప్‌నకు చట్టబద్ధత కల్పించామని, రిజిస్ర్టేషన్ ద్వారా భాగస్వామల హక్కులకు పరిరక్షణ లభిస్తుందని, వారికి పుట్టే పిల్లలకు గుర్తింపు, రక్షణ ఉంటుందని చెప్పారు. అస్సాంలోని గిరిజనులను బిల్లు నుంచి మినహాయించినట్టు తెలిపారు.


అస్సాంకు రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హిమంత బిశ్వ శర్మ ఈనెల 13న స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రివర్గ సమావేశం జరిపారు. మే 21 నుంచి 26 వరకూ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. యూసీసీ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బిల్లును సభలో ప్రవేశపెట్టగలమని వివరించారు.


ఇవికూడా చదవండి..

బహిరంగ నమాజ్‌, జంతుబలి నిషేధం.. సీఎం యోగి కీలక ఆదేశాలు

బీజేడీ రాజ్యసభ ఎంపీ సమంతరాయ్ రాజీనామా, బీజేపీలో చేరే ఛాన్స్

Updated Date - May 25 , 2026 | 04:56 PM