ఒడిశా టూర్కు IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:41 PM
హైదరాబాద్ నుంచి ఒడిశా వెళ్లాలనుకునే పర్యాటకులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఐదు రోజుల ఈ టూర్లో ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఒకేసారి చూడాలనుకునే పర్యాటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘ఒరియంటల్ ఒడిశా’ పేరుతో అందిస్తున్న ఈ టూర్లో హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఒడిశా చేరుకుని ఐదు రోజుల్లో పలు ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించవచ్చు.
టూర్ ఎప్పుడు.. ఎక్కడెక్కడికి?
ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 26, 2026న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. పూరీ జగన్నాథ ఆలయం, చిలికా సరస్సు, కోణార్క్ సూర్య దేవాలయం, భువనేశ్వర్లోని ప్రముఖ ఆలయాలు, జాజ్పూర్లోని బిరాజా దేవి శక్తిపీఠం, రత్నగిరి బౌద్ధ ప్రదేశాలు ఈ టూర్లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
మొదటి రోజు
సెప్టెంబర్ 26న ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి 6E 6242 విమానంలో ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 8:30 గంటలకు భువనేశ్వర్ చేరుకున్న తర్వాత పూరీకి బయలుదేరుతారు. మార్గమధ్యంలో ధౌళి స్తూపాన్ని సందర్శించి అనంతరం పూరీలో బస చేస్తారు.
రెండో రోజు
ఉదయం పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సత్పాడకు వెళ్లి చిలికా సరస్సు పరిసరాలను సందర్శిస్తారు. రాత్రి పూరీలోనే బస ఉంటుంది.
మూడో రోజు
పూరీ నుంచి కోణార్క్కు ప్రయాణించి ప్రపంచ ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత భువనేశ్వర్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు
జాజ్పూర్లోని బిరాజా దేవి శక్తిపీఠాన్ని దర్శించుకుంటారు. అనంతరం రత్నగిరిలోని బౌద్ధ అవశేషాలను సందర్శించి తిరిగి భువనేశ్వర్కు చేరుకుంటారు.
ఐదో రోజు
చివరి రోజు లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్ ఆలయం, రాజారాణి ఆలయాలను సందర్శిస్తారు. ఆ తర్వాత ఖండగిరి, ఉదయగిరి గుహలను చూసి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6:30 గంటలకు విమానంలో హైదరాబాద్కు బయలుదేరి రాత్రి 8:25 గంటలకు నగరానికి చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు?
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.42,100
డబుల్ ఆక్యుపెన్సీ (ఇద్దరికి): రూ.32,900
ట్రిపుల్ ఆక్యుపెన్సీ (ముగ్గురికి): రూ.30,700
మరో కేటగిరీలో:
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.46,000
డబుల్ ఆక్యుపెన్సీ: రూ.36,000
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.34,050
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
విమాన ప్రయాణం, హోటల్ వసతి, బ్రేక్ఫాస్ట్లు, డిన్నర్లు, ఏసీ బస్సులో స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు, పన్నులు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మొత్తం 29 మంది పర్యాటకులతో ఈ టూర్ను నిర్వహించనున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఇంట్లోనే ఇలా శుభ్రం చేస్తే మళ్లీ మెరిసిపోతాయి!
మరకలు, దుర్వాసనకు చెక్.. స్టీల్ బాటిల్ క్లీనింగ్కు బెస్ట్ చిట్కాలు ఇవే